బాణసంచా పేలి రెండంతస్థుల భవనం ధ్వంసం... ఒకరు దుర్మరణం
ABN , First Publish Date - 2020-09-26T16:18:12+05:30 IST
యూపీలోని మధుర పరిధిలో గల సురీర్ ప్రాంతంలో బాణసంచా పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన బాణసంచా పేలడంతో రెండస్థుల భవనం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
మధుర: యూపీలోని మధుర పరిధిలో గల సురీర్ ప్రాంతంలో బాణసంచా పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన బాణసంచా పేలడంతో రెండస్థుల భవనం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చారు.
రానున్న దీపావళి సందర్బంగా పటాకులు తయారు చేసేందుకు జోగేంద్ర సింగ్ అనే వ్యక్తి తన ఇంట్లో మందుగుండు సామానుతో పాటు బాణసంచాను అక్రమంగా నిల్వ చేశాడు. రెండవ అంతస్థులో నిల్వ ఉంచిన ఈ సామగ్రి అర్ధరాత్రి ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ రెండస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా కలకలం చెలరేగింది. ఈ ఘటనలో వ్యాపారి జోగేంద్ర మృతి చెందాడు. అతని భార్యాపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.