ప్రజలపై అదనపు భారం వద్దు
ABN , First Publish Date - 2020-05-19T11:17:17+05:30 IST
ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారం మోపడం సరికాదంటూ సోమవారం కడప నగరంలోని విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం వద్ద
రెండు నెలల విద్యుత్ చార్జీలు తక్షణమే రద్దు చేయాలి
అఖిలపక్షాల డిమాండ్
విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం వద్ద నిరసన
నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు
ప్రొద్దుటూరులో డిప్యూటీ సీఎంకు వినతి
కడప (మారుతీనగర్), మే 18: ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారం మోపడం సరికాదంటూ సోమవారం కడప నగరంలోని విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ... కరోనా కష్టకాలంలో పేద, మధ్యతరగతి ప్రజలు బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తుంటే దొడ్డిదారిన ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీలను పెంచడం దుర్మార్గ చర్య అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీల ప్రజానీకానికి దోబీ, బార్బర్ తదితర వృత్తిదారులకు ఇచ్చే విద్యుత్ రాయితీలను కూడా ఎత్తివేయడం విచారకరమన్నారు.
కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లిస్తూ విద్యుత్ వినియోగదారులపై భారం మోపడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే రెండు నెలల విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష పార్టీల నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, అమీర్బాబు (టీడీపీ), ఈశ్వరయ్య (సీపీఐ), సత్తార్ (కాంగ్రెస్), ఓబయ్య (సీపీఐ ఎంఎల్), సగిలి గురప్ప (బీఎస్పీ), సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.