రేషన్తో దందా
ABN , First Publish Date - 2020-06-07T07:39:31+05:30 IST
మండల పరిధిలోని యర్రగొండపాలెంలోని ఓ రైస్ మిల్లులో మూడు వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరులో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారిస్తున్న పోలీసులకు దీనిపై సమాచారం అందింది.
3 వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
ఆత్మకూరు, జూన్ 6: మండల పరిధిలోని యర్రగొండపాలెంలోని ఓ రైస్ మిల్లులో మూడు వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరులో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారిస్తున్న పోలీసులకు దీనిపై సమాచారం అందింది. మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కొందరు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. భారీగా సమకూరిన తరువాత ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరు ఏకలవ్య నగర్లోని పలు ఇళ్లలో అక్రమంగా నిల్వ వుంచిన 154 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మకూరు నుంచి అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని యర్రగొండపాలెంలోని వెంకటసాయి రైస్మిల్కు తరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యం మాదిరిగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తేలింది. దీంతో ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు, నందికొట్కూరు రూరల్ సీఐ ప్రసాద్, ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్రప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూర్గన్న రైస్మిల్ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ 50 కేజీల బరువున్న 6 వేల బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ నిల్వలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఉందన్న అంశంపై విచారణ జరుపుతున్నారు.