భార్య సంపాదనే ఆయన పీఎం కావడానికి అడ్డంకి?

ABN , First Publish Date - 2022-04-09T22:43:27+05:30 IST

బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషి సునక్ సతీమణి అక్షత మూర్తిపై ఆదాయపు పన్ను

భార్య సంపాదనే ఆయన పీఎం కావడానికి అడ్డంకి?

లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషి సునక్ సతీమణి అక్షత మూర్తిపై ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలతో ప్రముఖ పత్రికలన్నీ మొదటి పేజీల్లో ఈ వార్తను రాస్తున్నాయి. దీంతో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆమె బ్రిటన్ చట్టాలను ఉల్లంఘించలేదని కూడా తెలుస్తోంది. 


అక్షత మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఆమెకు నాన్ డొమిసిల్డ్ ట్యాక్స్ స్టేటస్ ఉండటంతో పన్నులు చెల్లించడం లేదని బ్రిటన్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ స్టేటస్ ఉంటే, విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌లో పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది.  అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. ఈ చట్టాల ప్రకారం ఆమె ఆ దేశంలో కొన్ని పన్నులను చెల్లించవలసిన అవసరం లేదు. దీంతో అక్షత, రుషి దంపతులపై వ్యతిరేక భావం ప్రచారమవుతోంది. దేశంలోని ప్రముఖ పత్రికలు తొలి పేజీల్లో దీనికి సంబంధించిన కథనాలను రాశాయి. 


నా భర్తను ఇబ్బంది పెట్టను 

ఈ నేపథ్యంలో అక్షత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్న ఆదాయంపై ఇకపై బ్రిటన్‌లో పన్నులు చెల్లిస్తానని చెప్పారు. తనకుగల నాన్ డొమిసిల్డ్ స్టేటస్ తన భర్తకు ఇబ్బందికరం కాకూడదన్నారు. తాను మారాలని కోరుకున్నందు వల్లే ఈ మార్పులు చేస్తున్నానని, నిబంధనలు కోరినందువల్ల కాదని తెలిపారు. ఈ నూతన ఏర్పాట్లు వెంటనే ప్రారంభమవుతాయన్నారు. 


అంతా దుష్ప్రచారమే 

అక్షత ఈ ప్రకటన చేయడానికి ముందు రుషి సునక్ మాట్లాడుతూ, తన భార్యపై తన విమర్శకులు బురద జల్లుతున్నారన్నారు. ఆమె తనను పెళ్లి చేసుకున్నందుకు తన దేశంతో సంబంధాలను తెంచుకోవాలని ఆమెను కోరడం సమంజసం కాదని, న్యాయం కాదని అన్నారు. ‘‘నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నట్లుగానే, ఆమె తన దేశాన్ని ప్రేమిస్తోంది’’ అని చెప్పారు. ఆమె బ్రిటన్‌లో సంపాదించిన ప్రతి పెన్నీకి బ్రిటన్ చట్టాల ప్రకారం పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. 


క్వీన్ ఎలిజబెత్ కన్నా సంపన్నురాలు

స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇన్ఫోసిస్ తెలిపిన వివరాల ప్రకారం, అక్షత మూర్తికి ఆ కంపెనీలో దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువైన వాటాలు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 కన్నా సంపన్నురాలిగా అక్షత రికార్డు సృష్టించారు. క్వీన్ వ్యక్తిగత ఆస్తుల విలువ 460 మిలియన్ డాలర్లు. 


పన్నుల పెంపుతో విమర్శలు ప్రారంభం

జీవన వ్యయం సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం పన్నులను పెంచింది. దీంతో ప్రతిపక్షాలు రుషి సునక్ దంపతులపై ఆరోపణలు ప్రారంభించాయి. రుషి చెప్తున్న ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీ కార్యాలయాలు రష్యాలో పని చేస్తుండటంపై కూడా విమర్శలు గుప్పించాయి. అక్షత రక్తపు సొమ్మును డివిడెండ్ల రూపంలో సంపాదిస్తున్నారని ఆరోపించాయి. దీంతో రష్యాలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలను మూసేశారు. 


పడిపోయిన గ్రాఫ్

ఈ వివాదాల ప్రభావం రుషి సునక్ రాజకీయ జీవితంపై బాగా పడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవిని రుషి సునక్ చేపట్టే అవకాశం ఓ నెల క్రితం 35 శాతం ఉండేది, కానీ నేడు అది 12 శాతానికి తగ్గిపోయింది. 


Updated Date - 2022-04-09T22:43:27+05:30 IST