సెయింట్ వ్లదిమిర్ అయ్యేందుకే పుతిన్ యుద్ధమా?
ABN , First Publish Date - 2022-02-25T19:59:35+05:30 IST
ఉక్రెయిన్పై యుద్ధం వెనుక రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్కు రెండు
మాస్కో : ఉక్రెయిన్పై యుద్ధం వెనుక రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్కు రెండు కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి, గత కాలపు సోవియెట్ యూనియన్ను పునరుద్ధరించడం కాగా, రెండోది, రష్యన్ ఆర్థొడాక్స్ చర్చ్ని పునఃస్థాపించి, సెయింట్ వ్లదిమిర్ అని పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష. ఈ దృక్కోణంతో నిపుణులతోపాటు క్రైస్తవ మత పెద్దలు కూడా వ్యాసాలు రాస్తున్నారు.
మొదటి రష్యా సామ్రాజ్యాన్ని, రష్యన్ ఆర్థొడాక్స్ చర్చ్ని వెయ్యేళ్ళ క్రితం వ్లదిమిర్-1 స్థాపించారు. రూస్ (రష్యా, ఉక్రెయిన్)ను పాగన్ దేశం నుంచి క్రైస్తవ దేశంగా మార్చినందుకు వ్లదిమిర్-1ను సెయింట్గా ప్రకటించారు. ఆయన కీవ్ నుంచి పరిపాలన చేశారు. ఈ నగరం ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా వ్లదిమిర్-2గా మారాలని పుతిన్ గట్టిగా కోరుకుంటున్నారని క్రైస్తవ పునరుజ్జీవ సిద్ధాంతకర్తలు చెప్తున్నారు.
రష్యా నియంత జోసఫ్ స్టాలిన్ వద్ద పని చేసిన కుటుంబంలో వ్లదిమిర్ పుతిన్ జన్మించారు. ఆయన తండ్రి నాస్తికుడు కాగా, తల్లి క్రైస్తవ విశ్వాసి అనే ప్రచారం ఉంది. ఆమె పుతిన్కు రహస్యంగా బాప్టిజం ఇప్పించారు. పుతిన్ ఇప్పటికీ క్రాస్ ధరిస్తారు. క్రైస్తవ విశ్వాసాన్ని పునఃస్థాపించడంలో పుతిన్కు రష్యన్ ఆర్థొడాక్స్ చర్చ్ మార్గదర్శనం చేస్తోందని తెలుస్తోంది.
మతపరమైన చరిత్రకారిణి డయానా బట్లర్ బాస్ ఉక్రెయిన్పై రష్యా దాడి గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం ఓ పాత కథకు కొత్త రూపాన్ని చూస్తోందని చెప్పారు. ఇంపీరియల్ క్రిస్టియన్ రాజ్య పునరుద్ధరణ, నూతన మధ్యయుగాల పవిత్ర రోమన్ సామ్రాజ్య స్థాపనను చూస్తోందన్నారు. యూరోపియన్ల భౌతిక, స్వర్గ సంబంధ అదృష్టాన్ని నియంత్రించేందుకు రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక శక్తులను ఓ వ్యవస్థగా సమైక్యపరచడాన్ని గమనిస్తోందన్నారు. మత సంప్రదాయవాదులను పలుకుబడిగల జాతీయ వాదులుగా నూతన క్రైస్తవ ప్రపంచంలో సమైక్యపరచేందుకు ఓ కూటమి కోసం పాశ్చాత్య దేశాల్లో చాలా మంది కలలు కంటున్నారన్నారు. ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్న పని చాలా కాలం నుంచి ఉన్న కల అని చెప్పారు. దీని లక్ష్యం లౌకికవాదం, కమ్యూనిస్టు చైనా, ఇస్లాంలను నిలువరించడమని తెలిపారు. అమెరికన్ ఎవాంజిలికల్స్, పాశ్చాత్య దేశాల్లోని సంప్రదాయ కేథలిక్లు, ఆర్థోడాక్స్ వర్గాల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పరచడం, క్రైస్తవ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడం ఈ సిద్ధాంతం లక్ష్యమని చెప్పారు.
మాస్కోను మూడో రోమ్గా చెప్తూ, దానికి ‘జెరూసలెం’ వంటి నగరం కీవ్ అని క్రైస్తవ మత పెద్దలు చెప్తున్నారు. దీనిని స్వాధీనం చేసుకుని తిరిగి రష్యన్ ఆర్థొడాక్స్ చర్చ్ ప్రతిష్ఠను పునరుద్ధరించాలని పుతిన్ ప్రయత్నిస్తున్నారని, అందుకే ఉక్రెయిన్పై దాడి చేస్తున్నారని చెప్తున్నారు.