ప్రేమ... పెళ్లి.. ఓ డాక్టర్ ఆత్మహత్య..
ABN , First Publish Date - 2020-03-14T09:55:53+05:30 IST
ఇటీవల దమ్మాయిగూడలో ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే సుచిత్ర సమీపంలో మరో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది.
భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని మనస్తాపం
డాక్టర్ అనుమానాస్పద మృతి
పేట్బషీరాబాద్, హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవల దమ్మాయిగూడలో ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే సుచిత్ర సమీపంలో మరో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. కనిపెంచి, కష్టపడి చదివించి డాక్టర్ను చేసిన తల్లిదండ్రులకన్నా... ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని డిప్రెషన్కు గురైన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపురం, ఠాగూర్ నగర్కు చెందిన ఆగయ్య సింగరేణిలో పదవీ విరమణ చేశాడు. బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చాడు. కుత్బుల్లాపూర్ గాయత్రినగర్, పద్మావతి హోమ్స్ ఫ్లాట్ నంబర్ 304లో నివసిస్తున్నాడు. ఇతడికి నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. నలుగురిలో చిన్నవాడైన దాసరపు సుభాష్(32) డాక్టర్ చదువును ఇటీవల పూర్తి చేశాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో చెవి, ముక్కు, గొంతు డాక్టర్గా పనిచేస్తున్న కేరళకు చెందిన డాక్టర్ నిత్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2017లో ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సుభాష్ ఉంటున్న ఇంటికి ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేది.
మనోవేదనకుగురై...
తమ పెళ్లి విషయం తల్లిదండ్రులతో చెప్పి వస్తానని నిత్య కేరళ వెళ్లింది. నెలలు గడుస్తున్నా తిరిగి రాలేదు. తమ తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించడంలేదని, వారు ఒప్పుకుంటేనే తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో డాక్టర్ సుభాష్ మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లి తన గదిలో నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన సుభాష్ రూమ్ నుంచి బయటకు రాలేదు. తల్లి మల్లమ్మ లేపడానికి ప్రయత్నించగా అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఆందోళనకుగురైన కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న సృజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పేట్బషీరాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న నిత్య తనను విడిచిపెట్టి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ మత్తు ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి ఆగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.