Dr. Ambruni: వాడుక భాషలో గురజాడ రచనలు
ABN , First Publish Date - 2022-09-22T16:41:24+05:30 IST
గురజాడ అప్పారావు 20వ శతాబ్ది మొదటిదశకంలో చేసిన రచనలు ఈ నాటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయని, ఆయన ప్రజలందరికీ
- డాక్టర్ ఆంబ్రూణి
చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గురజాడ అప్పారావు 20వ శతాబ్ది మొదటిదశకంలో చేసిన రచనలు ఈ నాటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయని, ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని రాజధాని కళాశాల తెలుగు శాఖాధ్యక్షురాలు డాక్టర్ ఆంబ్రూణి(Dr. Ambruni) పేర్కొన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘సాహిత్యకారుల జీవన చిత్రాలు’ కార్యక్రమంలో భాగంగా గురజాడ జయంతి వేడుక జరిగింది. తెలుగుశాఖాధిపతి విస్తాలి శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంబ్రూణి గురజాడ రచనల విశేషాలను విఫులీకరించారు. రాణీమేరీ కళాశాల తెలుగుశాఖకు చెందిన డాక్టర్ గూడూరు దయామణి మాట్లాడుతూ.. తెలుగుభాషా సాహిత్యాల్లో ఒక అపురూపమైన మౌలిక మార్పుకు నాంధి పలికిన కవి గురజాడ(Gurajada) అని, గుణాత్మకమైన మార్పు, కళ్లు చెదిరే ఆధునికతా విలువల ఎజెండాను జెండాగా పూని నిర్వహించిన విప్లవకర మార్పు ఆయనదని పేర్కొన్నారు. అందుకే ఆయన తెలుగుజాతి జీవన ప్రస్థానంలో ఆధునిక సాహిత్యానికి యుగకర్త అయ్యారన్నారు. గురజాడ స్త్రీ, పురుష సమానత్వాన్ని కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుశాఖ అధ్యాపకుడు డాక్టర్ మాదా శంకరబాబు స్వాగతం పలుకగా, వి.నీలిమ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆచార్య ఎల్బీ శంకరరావు, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ ఏవీ శివకుమారి, ఆముక్తమాల్యద, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.