ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అసైన్డ్ భూములు తీసుకోవద్దు
ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అసైన్డ్ భూములు తీసుకోవద్దు
- ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
- ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం, కాంగ్రెస్ నాయకుల ధర్నా
తాండూరు రూరల్, జూలై 4 : ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అసైన్డ్ భూములు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జినుగుర్తి గ్రామానికి చెందిన దళిత రైతులతోపాటు కొంతమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేనెంబర్-206లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం 295 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని, ప్రస్తుతం 84 కుటుంబాలకు చెందిన రైతులు ఆ భూములను సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. అయితే, తాండూరు ప్రాంతంలోని పాలిషింగ్ యూనిట్లను అన్నింటినీ ఒకేచోటకు తరలించి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో తమ భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని రైతులు పేర్కొన్నారు. తమ భూములు లాక్కుంటే జీవనాధారం కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కోవద్దని తాండూరు డిప్యూటీ తహసీల్దార్ ధనంజయకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పి.ఉత్తంచంద్, పటేల్ జనార్దన్రెడ్డిలు రైతులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు తెలిపారు. భూ బాధితులు కాశప్ప, ఎల్లప్ప, బాజరప్ప, వెంకటప్ప, అంజిలప్ప, మాణిక్యప్ప, అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.