నిబంధనల గీత దాటవద్దు
ABN , First Publish Date - 2021-03-05T06:30:40+05:30 IST
మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు విధిగా నిబంధనలు పాటించాలని మునిసిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి సూచించారు.
కౌన్సిలర్ అభ్యర్థులకు మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణి సూచన
ఎలమంచిలి, మార్చి 4 : మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు విధిగా నిబంధనలు పాటించాలని మునిసిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి సూచించారు. గురువారం ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల ఖర్చు, లెక్కల నిర్వహణ తదితరాల గురించి వివరించారు. కౌన్సిలర్ అభ్యర్థి రూ.1.5 లక్షలకు మించి ఖర్చు చేస్తే అనర్హుడిగా ప్రకటించడం జరుగుతుందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా ఆడిటర్ కుమార్, టీపీవో ప్రసాద్, మేనేజర్ డి.ప్రభాకర్ పాల్గొన్నారు.
స్టేడియంలో ఓట్ల లెక్కింపు
మునిసిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టు కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. సమావేశం అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగే కౌంటింగ్ ప్రక్రియను పట్టణంలోని క్రీడా వికాస కేంద్ర స్టేడియంలో చేపట్టనున్నామన్నారు. 25 వార్డులకు మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయన్నారు. 16వ వార్డు నుంచి మైచర్ల కిరణ్ ఏకగ్రీవమైనట్టు చెప్పారు. మిగిలిన 22 వార్డుల్లో 59 మంది పోటీలో నిలిచినిట్టు వివరించారు.