విద్యతోనే ఉన్నతస్థానాలు సాధ్యం
ABN , First Publish Date - 2022-07-04T05:56:53+05:30 IST
విద్య అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరమని, పేద కుటుంబాల వారు విద్య ద్వారానే ఉన్నత స్థానాలు పొందటం సాధ్యమవు తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
విద్యతోనే ఉన్నతస్థానాలు సాధ్యం
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
పటమట, జూలై 3 : విద్య అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరమని, పేద కుటుంబాల వారు విద్య ద్వారానే ఉన్నత స్థానాలు పొందటం సాధ్యమవు తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం అశోక్నగర్లోని శాంతి విద్యావనం స్కూల్లో గ్రూప్-4 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ మెటీరియల్ను మంచిర్యాలకు చెందిన బేతి తిరుమలరావు, ఆయన స్నేహితులు అయ్యప్ప భక్త బృందం పేరుతో అందించారు. సుమారు 250 మందికి ఈ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ తిరుమలరావు ఫ్రెండ్స్ సర్కిల్ అయ్యప్ప భక్త బృందం పేరుతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. గ్రూపు-4 పరీక్షలకు సిద్ధమవుతున్న వారంతా ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని, అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాక్షించారు. దూళిపాళ రమేష్బాబు, పొట్లూరి సాయిబాబు, మాధవరావు, మాదల రాజ్యలక్ష్మి, జంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్, కామినేని హాస్పటల్ వారి సహకారంతో 9వ డివిజన్ పటమటలంకలోని నల్లూరి సరోజినిదేవి స్కూల్లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని చెన్నుపాటి గాంధీ, కొమ్మా శివదుర్గా ప్రసాద్, యలమంచిలి దేవేంద్రలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. వైద్య శిబిరానికి సహకారం అందించిన కామినేని హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్టు, డాక్టర్లకు గద్దె కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీ, నర్రా కిషోర్, కొమ్మా బాబి, చెన్నుపాటి సురేష్, అన్నాభత్తుని బాబి, కర్ణా కోటేశ్వరరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.