దిశ-సుశాంత్ మరణాలపై వదంతులు.. పోలీసులను ఆశ్రయించిన దిశ తండ్రి..
ABN , First Publish Date - 2020-08-15T00:42:36+05:30 IST
దిశ సాలియన్ మృతిపై వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ ఇవాళ ముంబై పోలీసులను ఆశ్రయించారు...
ముంబై: దిశ సాలియన్ మృతిపై వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ ఇవాళ ముంబై పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు వ్యక్తులపై ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టేందుకు అవసరమైన సూచనల కోసం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దిశ తండ్రి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన అనంతరం మొత్తం ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికీ, దిశ మృతికి ముడిపెడుతూ వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా వేదికలపై ఇటీవల రకరకాల వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు మరణాలకు సంబంధం ఉందంటూ పలువురు రాజకీయ నేతలు సైతం ఆరోపణలు చేశారు. కాగా ముగ్గురు వ్యక్తులు తన కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని సతీశ్ సాలియన్ ఆరోపించారు. ఆయన పేర్కొన్న పేర్లలో పునీత్ వశిష్ట, సందీప్ మలానీ, నమాన్ శర్మ ఉన్నారు. నిందితులు పెట్టిన పలు నకిలీ కథనాలు, పోస్టులను కూడా ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా దీన్ని సీరియస్గా తీసుకుంటామనీ... నిందితులపై ఐటీ, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.