ఆ వర్గాలపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారు: మోదీ
ABN , First Publish Date - 2021-04-12T22:58:04+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి..
నార్త్ 24 పరగణాలు: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి విమర్శలు గురిపించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని ఆక్షేపించారు. తనపైనే కాకుండా, బెంగాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన తన సోదర సోదరీమణులపై దీదీ యుద్ధం ప్రకటించారని నార్త్ 24 పరగణాల జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు.
మొదటి నాలుగు విడతల పోలింగ్లో బెంగాల్ ప్రజలు బీజేపీకి విజయాన్ని ఖాయం చేశారని ప్రధాని పేర్కొన్నారు. మమత ఆగ్రహానికి ఇదొక కారణమని అన్నారు. ఎన్నికల్లో హింస గురించి మోదీ ప్రస్తావిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కనీసం ఒక్క ఎన్నికల ర్యాలీలోనైనా మమత పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడే వారు, ఓటింగ్ను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటమాత్రంగానైనా మమత చెప్పారా అని ఆయన నిలదీశారు. కాగా, బెంగాల్లో 8వ విడతల పోలింగ్లో భాగంగా ఇంతవరకూ నాలుగు విడతలు పూర్తయ్యాయి. ఐదో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది.