ధాన్యం కొనేవారేరి!?
ABN , First Publish Date - 2021-05-06T05:22:17+05:30 IST
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు.
మనుబోలు, మే 5 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కొర్రీతో విసుగుపోయిన రైతులు దళారులకు అమ్ముకుందామనుకున్నా వారూ ముందుకు రావడంతో లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారు. బుధవారం మనుబోలులో రాసులుగా పోసిన ధాన్యం ముందు కొందరు కర్షకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజులుగా వందలాది పుట్ల ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ కొనేవారు కోసం ఎదురుచూస్తున్నట్లు ఆవేదన చెందారు. సాగునీరు చాలక, మోటార్లకు విద్యుత్ సరఫరా లేక, సకాలంలో విత్తనాలు దొరక్క, తెగుళ్ల వల్ల గతంలో వరిసాగు చేయాలంటే అష్టకష్టాలు పడేవారమని పేర్కొన్నారు. ప్రస్తుతం అవన్నీ దాటుకుని పండించిన ధాన్యం అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తేమశాతం ఒకటైతే, మిల్లుల వద్ద మరోమారు తేమశాతం ఇంకోలా చూపి పుట్టికి 1060 కేజీలు ఇవ్వాలని అడుగుతున్నారని వాపోయారు. అందువల్ల వారికి ధాన్యం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రభుత్వమే భరోసా ఇచ్చి మద్దతుధరకు 860కేజీలు లెక్కన ధాన్యం తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.