శ్రీశైలానికి తరలి వస్తున్న భక్తులు
ABN , First Publish Date - 2021-03-07T05:36:30+05:30 IST
శ్రీశైలం, మార్చి 6: శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. క్షేత్ర వీధుల్లో భక్తజన సందోహం కనిపించింది.
శ్రీశైలం, మార్చి 6: శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. క్షేత్ర వీధుల్లో భక్తజన సందోహం కనిపించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులతో కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్షేత్రంలోని అన్నదాన, వసతి కేంద్రాలు కిక్కిరిసాయి. స్వామివారి సర్వ దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పాదయాత్ర భక్తులకు ప్రత్యేక దర్శనం
బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా వచ్చే భక్తులకు ఉచితంగా శీఘ్రదర్శనం కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. నడకమార్గంలోని పెచ్చెర్వు వద్ద ప్రత్యేక కంకణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కంకణధారణ చేసిన భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించారు.
ఇరుముడి సమర్పించిన శివదీక్షాస్వాములు
మండల, అర్థమండల దీక్ష స్వీకరించిన శివ స్వాములు శనివారం మల్లన్నకు ఇరుముడులు సమర్పించారు. అనంతరం శివదీక్షా శిబిరాలలో శాస్ర్తోక్తంగా దీక్షను విరమించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, పంచమాంకములు, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాన్ని శనివారం ప్రదర్శించారు.