ఇంటి పట్టాల దీక్ష భగ్నం - నిరసనకారుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-17T05:49:56+05:30 IST
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానికంగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు.
ఉరవకొండ, ఏప్రిల్ 16: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానికంగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష రెండో రోజూ కొనసాగగా, దీక్షల్లో కూర్చున్న మధుసూదననాయుడు, రంగారెడ్డి, శీనప్పకు వైద్యులు ఎర్రిస్వామి రెడ్డి, రంజిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరికి బీపీ తగ్గిపోవడంతో దీక్షను విరమించాలని ఎస్సై రమే్షరెడ్డి, తహసీల్దారు మునివేలు సూచించారు. ఇళ్లస్థలాలు పంపిణీ చేసేంతవరకూ దీక్ష కొనసాగిస్తామని నిరసన కారులు భీష్మించారు. 15 ఏళ్లుగా ఉరవకొండలో పేదలు ఇళ్లస్థలాలకు నోచుకోలేదన్నారు. ఇళ్లస్థలాల విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశామని తహసీల్దారు తెలిపా రు. నాయకులు దీక్ష విరమించకపోవడంతో వారిని అరెస్ట్ చేసి జీపులో ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో అంజినేయులు, వీరసేన తదితరులు పాల్గొన్నారు.