ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతోంది: వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2021-08-19T09:22:38+05:30 IST

చట్టసభల్లో తరచూ జరుగుతున్న అంతరాయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతోంది: వెంకయ్య నాయుడు

బెంగళూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో తరచూ జరుగుతున్న అంతరాయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వుల పాలవుతోందని అన్నారు. బెంగళూరు నగరంలోని విధానసౌధలో బుధవారం ఆయన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. చట్టసభల్లో కొంతకాలంగా సాగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల రాజ్యసభ సజావుగా సాగకపోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కొందరు సభ్యులు పార్లమెంటు స్థాయిని దిగజార్చేలా ప్రవర్తించారని వాపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనన్నారు. కాగా, ఇదే వేదికపై రామయ్య గ్రూప్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎంఆర్‌ జయరాంకు సర్‌  విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాన్ని వెంకయ్య ప్రదానం చేసి, సత్కరించారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-08-19T09:22:38+05:30 IST