పలు చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-29T04:52:22+05:30 IST

నగరంలో జరిగిన ఐదు చోరీలకు సంబంధించి 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు.

పలు చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

రూ.20 లక్షల సొత్తు స్వాధీనం

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నగరంలో జరిగిన ఐదు చోరీలకు సంబంధించి 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. పోలీస్‌కమిషనరేట్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 26న పినగాడిలోని వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక వైపున పార్కింగ్‌ చేసిన లారీ చోరీకి గురికావడంతో ఈస్ట్‌కోస్ట్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ మట్ట ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి గజపతినగరంలో లారీని స్వాధీనం చేసుకుని నిందితుడు కటన శేఖర్‌నాయుడు(27)ను అరెస్టు చేశారన్నారు. దువ్వాడ సమీపంలోని మంగళపాలెం వద్ద ఏపీ టిడ్కో హౌసింగ్‌ కింద ఇళ్ల నిర్మాణం చేస్తున్న టాటా ప్రాజెక్ట్స్‌కి చెందిన రూ.2.20 లక్షల విలువైన 1695 కిలోల అల్యూమినియం షట్టర్‌ బోర్డులు, బోల్ట్‌లు చోరీకి గురికావడంతో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ బండారు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దువ్వాడకు చెందిన ప్రణయ్‌వర్మ(31), తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకి చెందిన తిరుమలరాజు రామకృష్ణ ఇక్ష్వాకు, అనకాపల్లిలోని జంపారివీధికి చెందిన అర్రెపు వెంకటరమణమూర్తి అలియాస్‌ శ్రీనివాసరావుతోపాటు చోరీ సొత్తును కొనుగోలుచేసిన గాజువాక ఆటోనగర్‌లోని స్ర్కాప్‌ దుకాణం యజమాని మితుకుళ్ల పుల్లయ్యను అరెస్టుచేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.కేజీహెచ్‌లో డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఈటి కృష్ణ అరుణ్‌కుమార్‌ స్కూటీ ఈ ఏడాది జూలై 27న అపహరణకు గురికావడంతో వన్‌టౌన్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేసి పరవాడ మండలం బీసీ కాలనీకి చెందిన కంచిపాటి ప్రేమ్‌చంద్‌ చోరీకి పాల్పడినట్టు గుర్తించి అతని వద్ద నుంచి బైక్‌ స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గాజువాక ఆటోనగర్‌లో దుకాణం నిర్వహిస్తున్న సిరికి మోహనరావు షాపులో ఈనెల 26న చోరీ జరిగి రూ.1.02 లక్షల విలువైన రాగి ప్లేట్లు అపహరణకు గురికావడంతో గాజువాక పోలీసులు దర్యాప్తు చేసి డ్రైవర్స్‌కాలనీకి చెందిన పెయింటర్లు చీపుర్ల రాజ(27), కుండి శివ(28)తోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన భానోజీతోటకు చెందిన దవర్ల నాగరాజు(45)ను అరెస్టు చేసి చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. గాజువాక బీసీ రోడ్డులో ఎఫ్‌ఎస్‌ సౌండ్స్‌ దుకాణంలో ఈ నెల 10న చోరీ జరిగి రూ.1.50 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురికావడంతో పోలీసులు దర్యాప్తు చేసి పెదగంట్యాడకు చెందిన ఆసనాల శామ్యూల్‌(20), ఆసనాల ప్రకాష్‌(22) చోరీ చేసినట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారని సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో క్రైమ్‌ ఏసీపీ సీహెచ్‌ పెంటారావు, సీసీఎస్‌ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్‌, సీఐ పి.సూర్యనారాయణ ఇతర సీఐలు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T04:52:22+05:30 IST