అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-06-22T06:26:27+05:30 IST
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని దీపాలదిన్నెపాలెంలో సోమవారం జరిగింది.
భర్త, బంధువులే చంపారని ఆరోపణలు
సత్తెనపల్లి రూరల్, జూన్ 21: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని దీపాలదిన్నెపాలెంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన కంచెర్ల అరుణకు తల్లిదండ్రులు లేకపోవటంతో పెదనాన్నవద్ద ఉంటోంది. ఆరునెలల క్రితం దీపాలదిన్నెపాలెం గ్రామానికి చెందిన కంచెర్ల సాగర్తో ఆమెకు వివాహం జరిపించారు. అయితే సోమవారం తెల్లవారుజామున అరుణ ఉరివేసుకొని ఉందని భర్త సాగర్ మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. అయితే అరుణ మెడ కమిలినట్లు ఉండటాన్ని గమనించిన మృతురాలి బంధువులు ఇది ఆత్మహత్య కాదు హత్యేనని నిర్థారణకు వచ్చి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి అరుణ మృతిపై విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.మృతురాలి సోదరి మేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
భర్త, బంధువులే చంపారు
సాగర్కు గ్రామంలోని వారి బంధువర్గంలోని ఒక వివాహితతో వివాహేతర సంబంధం ఉందని అరుణ తరపు బంధువులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే సాగర్, అతని బంధువులు అరుణను కొట్టి చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతిరాలి సోదరి మేరి, బంధువులు ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు.