ఆత్మగౌరవంతో బతికేందుకు ‘దళితబంధు’
ABN , First Publish Date - 2022-05-21T06:31:13+05:30 IST
దళిత బంధు పథకం అమ్ముకునేది కాదని, ఆత్మగౌరవం, ఆర్థికస్వావలంబనతో బతికేందుకు పథకం వచ్చిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి
- దళితబంఽధు లబ్ధిదారులతో సమావేశం
సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం అమ్ముకునేది కాదని, ఆత్మగౌరవం, ఆర్థికస్వావలంబనతో బతికేందుకు పథకం వచ్చిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లోని దళిత బంధు పథకం లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు పథకంలో లాభదాయకమైన యూనిట్లను స్థాపించాలని, వ్యాపార రంగంలో ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చెందాలని అన్నారు. దళిత బంధు పథకంలో నాణ్యమైన యంత్రాలు, పరికరాలు తీసుకోవాలన్నారు. కూలీలుగా పనిచేస్తున్న వారు మరో నలుగురికి ఉద్యోగాలు, ఉపాధి ఇచ్చేలా ఎదగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా సక్సెస్ కావాలన్నారు. లబ్ధిదారులు మోసపోకుండా అధికారులు నాణ్యమైన పరికరాలు అందించే విధంగా చూడాలన్నారు. జిల్లాలో 163 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం దళిత బంధు నిధులు జమ చేయాలన్నారు. జూన్ 2 వరకు యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. దళిత బంధు నిధులతో కార్లు, ట్రాక్టర్లు, వంటి వాహనాలు కొంటే వాటి విలువ తగ్గి నష్టపోతుందన్నారు.. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వినోద్, డీఆర్డీవో మదన్మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కొమురయ్య, మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఎంపీడీవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.