దళితబంధు అందరికి అందుతుంది

ABN , First Publish Date - 2021-10-21T06:05:16+05:30 IST

దళితబంధు పథకం అర్హులందరికీ అందుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.బుధవారం ఆయన జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు.

దళితబంధు అందరికి అందుతుంది
జమ్మికుంటలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు 

జమ్మికుంట రూరల్‌, అక్టోబరు 20: దళితబంధు పథకం అర్హులందరికీ అందుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.బుధవారం ఆయన జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విధాలుగా  ఆలోచించి ఓటు వేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ అని, తెలంగాణ కోసం కోట్లాడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్‌ అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ను 2,016 చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. దళితబంధు కూడా అందరికీ అందుతుందన్నారు. బీజేపీ వాళ్లు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు.  బీజేపీ వాళ్లు విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి ప్రతీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారని, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో మంత్రులంతా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించారని, హుజూరాబాద్‌లో ఈటల ఎందుకు కట్టించలేకపోయారని ప్రశ్నించారు. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు. తన స్వార్థం కోసం ఈటల రాజీనామా చేశారని, ఈటల గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు గెలిస్తే ప్రజలకు లాభమన్నారు. నాయిని చెరువును సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీ వర్షాలు పడితే వరదలమయమవుతోందని, మంత్రిగా ఉండి ఈటల ఇక్కడి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ భూముల పంచాయితీ పెట్టుకొని ఈటల రాజేందర్‌ బీజేపీ చేరారన్నారు. టీఆర్‌ఎస్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated Date - 2021-10-21T06:05:16+05:30 IST