అనకాపల్లిలో కర్ఫ్యూ విజయవంతం
ABN , First Publish Date - 2021-05-06T05:28:59+05:30 IST
అనకాపల్లిలో పాక్షిక కర్ఫ్యూ తొలి రోజు బుధవారం విజయవంతమైంది.
12 గంటలకే దుకాణాల మూసివేత
నిర్మానుష్యంగా రహదారులు
అనకాపల్లి టౌన్, మే 5: అనకాపల్లిలో పాక్షిక కర్ఫ్యూ తొలి రోజు బుధవారం విజయవంతమైంది. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి పనులపై పట్టణానికి వచ్చిన ప్రజలతో రహదారులన్నీ సందడిగా మారాయి. 11.45 నిముషాలకు పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసులు రహదారులపైకి వచ్చి దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎస్ఐ ఎల్.రామకృష్ణ జీపులో మైక్ ద్వారా దుకాణాలు మూసేయాలని, రోడ్లపై ఎవరూ ఉండకూదని స్పష్టం చేశారు. దీంతో దుకాణలన్నీ 12 గంటలకే దుకాణాలు మూతపడ్డాయి. బెల్లం, కూరగాయల మార్కెట్లు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నెహ్రూచౌక్కు వచ్చి కర్ఫ్యూ అమలును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో జె. సీతారామారావు, జోనల్ కమిషనర్ పి.శ్రీరామ్మూర్తి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగాయి. అనంతరం డిపోకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తరువాత కాంప్లెక్స్లోని ప్లాట్ఫారాలు బోసిబోయాయి. అత్యవసరమైన పనులకు పోలీసులు మినహాయింపు ఇచ్చారు.