పంట రుణమాఫీ రూ.7.76 కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2020-06-01T09:22:35+05:30 IST
ఉమ్మడిరంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల్లో రూ.25వేలలోపు పంట రుణాలు తీసుకున్న 5,493 మంది రైతులకు రుణమాఫీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి
కులకచర్ల: ఉమ్మడిరంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల్లో రూ.25వేలలోపు పంట రుణాలు తీసుకున్న 5,493 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు రూ.7.76 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, కులకచర్ల సొసైటీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కులకచర్లలో విలేకరులతో మాట్లాడారు. రూ.25 వేలలోపు పంట రుణాలు తీసుకున్న 15,313 మంది రైతులకు రూ.19.7 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో మొదటి విడతగా 5,493 మంది రైతులకు రుణమాఫీ వచ్చిందన్నారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 44,487 మంది రైతులకు రూ.202.09 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.
ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా పరిధిలో డీసీసీబీ ద్వారా 35,600 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 24,800 టన్నులు, మేడ్చల్ జిల్లా పరిధిలో 16,218 టన్నుల వరి ధాన్యాన్ని రూ.141.80 కోట్లతో కొనుగోలు చేశామన్నారు. జూన్ 8వరకు వరి ఽధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. బంగారు రుణాలపై గతంలో గ్రాముకు రూ.2,500 ఇచ్చేవారం అని, ఇక ముందు రూ.3000 చెల్లిస్తామన్నారు. ఇప్పటివరకు 106కోట్లు బంగారు రుణాలు ఇచ్చామని చెప్పారు. కొత్తగా రూ.110కోట్లు బంగారు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించామని తెలిపారు. ఇప్పటి వరకు హౌజింగ్ రుణాలు రూ.25లక్షలు, వ్యాపారులకు రూ.25లక్షలు ఇచ్చామని తెలిపారు.
ఈ సంవత్సరం రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.77కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పంట రుణమాఫీ పొందిన రైతులకు, కొత్త రైతులకు పంట రుణాలు రూ.40కోట్లు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశామని, అవసరమైతే రూ.50కోట్లు మం జూరు చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి సొసైటీ పరిధిలో కొత్తగా ఫర్టిలైజర్ షాపును ఏర్పాటు చేస్తున్నామన్నారు.