పోలీసులు వేధిస్తున్నారంటూ.. ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-08-30T06:20:32+05:30 IST
పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని వెల్లటూరులో చోటు చేసుకుంది.
భట్టిప్రోలు, ఆగస్టు 29: పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని వెల్లటూరులో చోటు చేసుకుంది. భార్య రేవతి తెలిపిన వివరాల ప్రకారం.. కోళ్ల దొంగతనం చేస్తున్నాడంటూ ఆమె భర్త ఉప్పాల భానుచందర్ను పోలీసులు తరచూ స్టేషన్కు పిలుస్తున్నారు. ఇది గత రెండు సంవత్సరాలుగా జరుగుతోందని, ఈ కేసు విషయమై దాదాపు రూ.లక్ష ఖర్చు చేశామని తెలిపారు. సోమవారం ఉదయం కోడూరు పోలీస్స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భానుచందర్ వరినాట్లు వేసేందుకు వెళ్ళిన భార్యకు ఫోన్ చేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో పోలీసుల వేధింపులు నేను భరాయించ లేకపోతున్నాను.. ఇక నేను బతకలేనంటూ ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన భార్య స్థానికులకు విషయాన్ని తెలియజేసింది. అప్పటికే విషపు గుళికలు తిని పడిపోయిన భానుచందర్ను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కోడూరు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ మేరకు భట్టిప్రోలు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రేవతి తెలిపారు.