కేరళలో సీపీఎం కార్యకర్త హత్య.. ఆర్ఎస్ఎస్‌పై ఆరోపణలు

ABN , First Publish Date - 2022-02-22T01:56:05+05:30 IST

హరిదాస్ చేపలు పట్టి తిరిగి వస్తుండగా అతడి ఇంటి చాటున వేచి ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారు. అతడిని పదునైన ఆయుధాలతో చాలాసార్లు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల నివసించే బంధువులు అతన్ని తలస్సేరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు..

కేరళలో సీపీఎం కార్యకర్త హత్య.. ఆర్ఎస్ఎస్‌పై ఆరోపణలు

తిరువనంతపురం: కేరళలోని కన్నూరులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్)కి చెందిన ఒక కార్యకర్తను కొందరు కిరాతకంగా కొట్టి చంపారు. అయితే ఈ హత్య చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలేనని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కన్నూరు జిల్లాలోని తలస్సెరి ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ హత్య జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడి పేరు కొరంబిల్ హరిదాస్(54) అని, అతడు పున్నోల్‌లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటాడని పేర్కొన్నారు.


హరిదాస్ చేపలు పట్టి తిరిగి వస్తుండగా అతడి ఇంటి చాటున వేచి ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారు. అతడిని పదునైన ఆయుధాలతో చాలాసార్లు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల నివసించే బంధువులు అతన్ని తలస్సేరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అతడిని కాపాడుకోలేకపోయామని వాపోయారు. దాడి అనంతరం నలుగురు సభ్యుల ముఠా రెండు బైక్‌లపై పరారైనట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. హత్య జరిగిన కొన్ని గంటలకు అప్పటికి వారం కిందటి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కన్నూరుకి చెందిన ఒక బీజేపీ నేత మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ సిపిఎం కార్యకర్తపై ఎలా పగ తీర్చుకునేదో వివరించారు.


ఆ బీజేపీ నేత కె.లిజేష్ అని పోలీసులు గుర్తించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తల దాడికి నిరసనగా చేపట్టిన ఒక నిరసనను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వీడియో అది. కన్నూరులో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తలస్సెరిలో మరింత కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-22T01:56:05+05:30 IST