మూడోసారి తమ్మినేనికి సీపీఎం పగ్గాలు

ABN , First Publish Date - 2022-01-26T06:39:22+05:30 IST

మూడోసారి తమ్మినేనికి సీపీఎం పగ్గాలు

మూడోసారి తమ్మినేనికి సీపీఎం పగ్గాలు

రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన వీరభద్రం

ఖమ్మం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా చెందిన తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యా రు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర మహాసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీపీఎంలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తమ్మినేని అనేక ప్రజా ఉద్యమాలకు దిక్చూచిగా నిలిచారు. పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యదర్శిగా, చట్ట సభల్లో ప్రజాప్రతినిధిగా తన మార్కు రాజకీయాన్ని చూపించారు. రైతు కూలీ పోరాటాలు, రైతు ఉద్యమాల్లో ముందున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని వీరభద్రం 1971లో సీపీఎంలో చేరి 1985లో ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా, 1991లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 1996వరకు, ఆ తర్వాత 2001లో రెండో సారి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర కమిటీల్లో పలు పదవులు చేపట్టిన తమ్మినేని 1991లో తొలిసారిగా ఖమ్మం ఎంపీగా పోటి చేసి ఓటమి చెందారు. మళ్లీ 1996లో ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. 2004లో ఖమ్మం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతకు ముందు సీపీఎం నేతగా జిల్లాలో 2,662 కిలో మీటర్లు 100 రోజులు పాటు మహాప్రస్థాన పాద యాత్ర నిర్వహించిన ఆయన దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమాలు కూడా చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా మహాజన పాదయాత్ర కూడా చేశారు. ఇలా అనేక ఉద్యమాలు నిర్వహించిన తమ్మినేని వీరభద్రం 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం తొలిసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా, 2018లో రెండో సారి ఎన్నికయ్యారు. మళ్లీ ముచ్చటగా మూడోసారి కూడా తమ్మినేనినే ఆ బాధ్యతలను అప్పగించారు. మరో రెండేళ్లలో జరగబోయే అసెంబబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ్మినేనికి మూడో సారి పార్టీ పగ్గాలు అప్పగించటం ద్వారా రాష్ట్రంలో పార్టీని ఎన్నికల దిశగా సమర్థవంతగా ముందుకు నడిపిస్తారని పార్టీ కేడర్‌ భావిస్తోంది. 

Updated Date - 2022-01-26T06:39:22+05:30 IST