అడ్డగుట్టలో ఆస్పత్రి నిర్మించాలని సీపీఎం ధర్నా
ABN , First Publish Date - 2020-07-08T09:29:30+05:30 IST
అడ్డగుట్టలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీపీఎం సికింద్రాబాద్ కార్యదర్శి ఎం. అజయ్బాబు ప్రభుత్వాన్ని..
అడ్డగుట్ట, జూలై 7(ఆంధ్రజ్యోతి): అడ్డగుట్టలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీపీఎం సికింద్రాబాద్ కార్యదర్శి ఎం. అజయ్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుకారాంగేట్ పోలీ్సస్టేషన్ వెనుకవైపు ఉన్న వెయ్యి చదరపు గజాల ఖాళీ స్థలం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డగుట్టలో 50 పడకల ఆస్పత్రికి ప్రభుత్వం స్థలం కేటాయించిందనీ, మాజీ ఎమ్మెల్యే జయసుధ అసెంబ్లీలో ప్రస్తావించగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూ రు చేసిందని, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
ఆస్పత్రి స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, పద్మారావు దృష్టికి తీసుకెళ్తే స్థలంపై కోర్టులో కేసు ఉందని చెప్పారన్నారు. ఆస్పత్రి నిర్మాణం చేపట్టకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అజయ్బాబు హెచ్చరించారు. ధర్నాలో ఐద్వా నాయకురాలు వెంకటలక్ష్మి, కౌసల్య, అంజమ్మ, లలిత, అలేఖ్య, సునీత, పద్మ, కృపాకర్, జ్యోతి, ఆనంద్, శివరాజ్ పాల్గొన్నారు.