కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , First Publish Date - 2021-04-22T05:19:33+05:30 IST
కరోనా బాధితులకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జీజీహెచ్ ఎదుట వారు ధర్నా చేశారు.
పడకలు అందుబాటులో ఉంచాలి
జీజీహెచ్ ఎదుట సీపీఎం ధర్నా
నెల్లూరు (వైద్యం), ఏప్రిల్ 21 : కరోనా బాధితులకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జీజీహెచ్ ఎదుట వారు ధర్నా చేశారు. ఆ తర్వాత అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీజీహెచ్లో కరోనా నిర్థారణ పరీక్షలు జరిపిన వెంటనే ఫలితాలు తెలియచేసి బాధితులను ఐసోలేషన్ వార్డులకు తరలించాలన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. సిటిస్కాన్, ఎమ్మారై వంటి పరికరాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కటారి అజయ్కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని వెంటనే నియమించాలని కోరారు. రోజురోజుకు మరణాలు పెరుగుతున్న కారణంగా అవసరమైన శీతల శవపేటికలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీఐటీయూ రూరల్ కార్యదర్శి అల్లాడి గోపాల్, బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ కరోనా నిర్థారణ పరీక్షల కేంద్రాలను పెంచాలని, మరణించిన వారి పార్థివ దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిన్నెర కుమార్, కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, రఫీ అహ్మద్, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.