ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఏసీబీ విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-08-09T03:44:34+05:30 IST

కావలిలో జరిగే ప్రభుత్వ స్థలాల కబ్జా, అక్రమ నిర్మాణాలు, గ్రావెల్‌ దందాపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల నేతలు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఏసీబీ విచారణ జరిపించాలి
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వామపక్షాల నేతలు

ఆర్డీవో కార్యాలయం వద్ద వామపక్షాల నేతల ధర్నా

కావలిటౌన్‌, ఆగస్టు 8: కావలిలో జరిగే ప్రభుత్వ స్థలాల కబ్జా, అక్రమ నిర్మాణాలు, గ్రావెల్‌ దందాపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల నేతలు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పీ.పెంచలయ్య, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం మాట్లాడుతూ పట్టణ పరిధిలో అనేక కుంటలు, చెరువులు, కాలువలు ప్రభుత్వ ఖాళీ స్థలాలు అఽధికార పార్టీ నేతల అండతో కబ్జా జరిగాయన్నారు. ఆ స్థలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిందని, పక్కా భవనాలు నిర్మించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నా అధికారులు మిన్నకుండడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో  పేదవాడికి సెంటు భూమి ఇచ్చి పట్టణ నడిబొడ్డునున్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అధికార పార్టీ వారికి ఎకరాలు ఇవ్వడం ఎంతమాత్రం సబబన్నారు. మరికొందరు బహిరంగంగా అక్రమ మైనింగ్‌ వ్యాపారం చేస్తూ  ప్రభుత్వ ధనాన్ని గండి కొడుతుంటే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారని ఎద్దెవా చేశారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ స్థలాల కబ్జాకోరులపై, అవినీతి అధికారులపై ఏసీబీచే విచారణ జరిపించి శిక్షించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు మధుసూదన్‌రావు, కృష్ణయ్య, కృష్ణమోహన్‌, సీపీఐ నేతలు చేవూరు కొండయ్య, బోసు, నరసింహ, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T03:44:34+05:30 IST