నల్లచట్టలు రద్దు అయ్యేవరకు మా పోరాటం ఆగదు: Ramakrishna
ABN , First Publish Date - 2021-10-18T18:56:36+05:30 IST
నల్ల చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైల్రోకో నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
విజయవాడ: నల్ల చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైల్రోకో నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉత్తరప్రదేశ్లో పాశవికంగా రైతులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేశారని.. కానీ కేంద్రమంత్రి కేబినెట్లోనే కొనసాగుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై మోదీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నల్లచట్టాలు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్కు ప్రజలు అధికారం ఇస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయని.. పారిశ్రామికవాడలో కరెంట్ తీసివేస్తున్నారన్నారు. కానీ రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ కోతలు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. ఇంధన శాఖ కార్యదర్శి కరెంట్ కోతలపై ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అనడం గర్హనీయమని అన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, అప్పులపై జగన్ ప్రభుత్వం ఎందుకు నిజాలు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆర్థికశాఖ మంత్రి అప్పుల కోసమే ఢిల్లీలో ఉంటున్నారన్నారు. తమ రెండున్నరేళ్ల పాలనలో అప్పు ఎంత చేశారని నిలదీశారు. అభివృద్ధి ఏమి చేశారని.. సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాజకోట రహస్యం మాదిరి ఏ విషయాలు బయటపెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో చేసిన అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టుబట్టారు. కర్నూల్ జిల్లా దేవరగట్టు కర్రల సమరాన్ని ఎందుకు అపలేకపోతున్నారని అడిగారు. 1500 మంది పోలీసులు బందోబస్తు చేసిన కర్రల సమరం ఆగలేదన్నారు. ఈ అంశాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడవద్దని.. వెనుకబాటుతనంగా చూడాలని సూచించారు. ఆ ప్రాంతంలో విద్యాకేంద్రాలను ఏర్పాటు చేయడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ దురాచారం రూపుమాపాలని రామకృష్ణ హితవుపలికారు.