Covid కట్టడికి చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2022-05-28T15:18:42+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
- కలెక్టర్లకు ఆరోగ్యశాఖ ఉత్తర్వులు
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్ ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ, దేశంలో ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా వరకు పెరిగిందని, ఇందువల్ల రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరిగే అవకాశముందని, జిల్లాల్లో అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. నగరంలో తేనాంపేట, అడయార్, అన్నానగర్, కోడంబాక్కం, పెరుంగుడి తదితర కార్పొరేషన్ జోన్లలో క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల జోనల్ అధికారులు పర్యవేక్షించాలని, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలు, రోడ్లపైకి వచ్చే వారు విధిగా మాస్కు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అదే సమయంలో వైరస్ అదుపులో ఉన్న జిల్లాల్లో కూడా పర్యవేక్షణలో లోపం లేకుండా ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 93.74 శాతం మంది మొదడి డోస్, 82.55 శాతం మంది రెండో డోస్ టీకాలు వేసుకున్నారని, 18 ఏళ్లు పైబడిన వారిలో 43 లక్షల మందికి పైగా మొదటి డోస్, 1.22 కోట్ల మందికి పైగా రెండో డోస్ వేయించుకోలేదని, వారి వివరాలు సేకరించి ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు మాత్రమే కాకుండా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్లు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు కరోనా వైర్సను కట్టడి చేయాల్సిందిగా తాను ఉత్తర్వులు జారీచేసినట్లు రాధాకృష్ణన్ తెలిపారు.