కరోనా ఆంక్షలు మరింత కఠినతరం

ABN , First Publish Date - 2021-05-07T18:04:13+05:30 IST

దేశవ్యాప్తంగా ఉధృతమవుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. కొన్ని రాష్ర్టాలలో ఇప్పటికే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. తమిళనాడు రాష్ట్రంలో అతి వేగంగా

కరోనా ఆంక్షలు మరింత కఠినతరం

        - ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం


హోసూరు(కర్ణాటక): దేశవ్యాప్తంగా ఉధృతమవుతున్న కరోనాను నియంత్రించేందుకు  ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. కొన్ని రాష్ర్టాలలో ఇప్పటికే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. తమిళనాడు రాష్ట్రంలో అతి వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వివిధ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. అయినా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి సరికొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నిత్యావసరాల నిమిత్తం మధ్యాహ్నం వరకు మాత్రమే దుకాణాల నిర్వహణకు వెసలుబాటు కల్పించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు మూతపడ్డాయి. మెడికల్‌ షాపులు, ఆసుపత్రులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వడంతో కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం 12 గంటల వరకే అన్ని  దుకాణాలు, వాణిజ్యకేంద్రాలు సాగాయి. హోసూరులో అన్ని ఎలక్ర్టికల్‌ షాపులు, కాయగూరల మార్కెట్‌లు, రైతుబజారు తదితర వాటిని 12 గంటల వరకు మాత్రమే నిర్వహించి అనంతరం మూసేశారు. ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉన్న ఎంజీ, నేతాజీ రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. అదేవిధంగా కెలమంగలం, డెంకణీకోట, ఉద్దనపల్లి, రాయకోట, అంచెట్టి, బాగలూరు, బేరికై, కృష్ణగిరి, ఊత్తాంగరై, కావేరిపట్టణం ప్రాంతాలు కూడా జనసంచారం లేక ఖాళీగా దర్శనమిచ్చాయి.


Updated Date - 2021-05-07T18:04:13+05:30 IST