అలుపెరుగని పోరు

ABN , First Publish Date - 2020-04-04T11:07:22+05:30 IST

అలుపెరుగని పోరు

అలుపెరుగని పోరు

కరోనా నియంత్రణకు యత్నం

నిరంతరం విధుల్లో రెవెన్యూ శాఖ

సంక్షేమ పథకాల అమలు 

ఎక్కడికక్కడ అవగాహన శిబిరాలు

 133 క్వారంటైన్‌కేంద్రాల్లో సేవలు

శ్రమిస్తున్న 1800 మంది ఉద్యోగులు 


గంట్యాడ, ఏప్రిల్‌ 3: కొవిడ్‌- 19 వైరస్‌ వ్యాప్తి నివారించడానికి రెవెన్యూ ఉద్యోగులు అహరహం శ్రమిస్తున్నారు.  ప్రజలకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పనలో కీలకంగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు నుంచి క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. గత నెల 22న జనతా కర్వ్యూ నుంచి ఇదే విధంగా పనిచేస్తున్నారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పారిశుధ్య కార్మికులతో పాటు  రెవెన్యూ అధికారులు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నారు. జిల్లాలోని రెండు డివిజన్లలోనూ తమసేవలను అందిస్తున్నారు. కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆధ్వర్యంలో  జాయింట్‌ కలెక్టర్‌, రెండో జేసీ, డీఆర్‌వో, ఆర్‌డీవోలు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సీనియర్‌ ఆసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ సహాయకులు కలిపి జిల్లా  వ్యాప్త్తంగా సుమారు 1800 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఉత్వర్తులు వచ్చిన వెంటనే షాపులు, సినిమా హాల్స్‌, వసతి గృహాలు, పెట్రోలు బంకులు, విద్యా సంస్థలు మూసి వేయించారు. ప్రజలందరికీ నిత్యావసర సరుకులైన కూరగాయలు, పాలు నిబంధనలను మేరకు విక్రయించే విధంగా చూస్తున్నారు. నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌ పంపిణీ చేపడతున్నారు. వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న వారిని గుర్తించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని అవసరమైనవారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 133 క్వారంటైన్‌ కేంద్రాలను గుర్తించి 2,522 గదులును ఏర్పాటు  చేశారు. వీటిలో 8,600 మందికి పడకలను సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న కూలీలు, ఉపాధి పనుల కోసం వచ్చి చిక్కుకుపోయిన వారికి ఉచిత ఆహారం అందిస్తున్నారు. పోలీసులు, వైద్య, మండల పరిషత్‌ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. కరోనాపై పోరుతో పాటు మిగిలిన కార్యకలాపాల్లోనూ రెవెన్యూ ఉద్యోగులు బిజీగా ఉన్నారు. 

Updated Date - 2020-04-04T11:07:22+05:30 IST