కరోనా నేపథ్యంలో ఆస్థానపరంగా పంచాగం శ్రవణం

ABN , First Publish Date - 2021-04-13T06:34:31+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాన్ని ఆస్థానపరంగా నిర్వహించనున్నారు. నాలుగేళ్లుగా యాదాద్రి ప్రధాన ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండటంతో బాలాలయంలోనే ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఆస్థానపరంగా పంచాగం శ్రవణం
లక్ష్మీనృసింహుల నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రిక్షేత్రంలో పండిత సన్మానాలు రద్దు

నేటి నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 12: కరోనా వైరస్‌ కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాన్ని ఆస్థానపరంగా నిర్వహించనున్నారు. నాలుగేళ్లుగా యాదాద్రి ప్రధాన ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండటంతో బాలాలయంలోనే ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. కాగా, గత ఏడాది కరోనా వైరస్‌ కారణంగా ఉగాది, పంచాంగ శ్రవణం, ఉపాలయంలో నిర్వహించే వసంత నవరాత్రి మహోత్సవాలు ఆస్థానపరంగా నిర్వహించారు. ఈ ఏడాది కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వేడుకలను ఆస్థానపరంగానే నిర్వహించనున్నట్టు దేవస్థాన అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఏటా ఉగాది సందర్భంగా ఐదుగురు పండితులను సత్కరించే సంప్రదాయం ఉండగా, దీన్ని ఈ ఏడాది రద్దు చేశారు. బాలాలయంలో కవచమూర్తులు, ఉపాలయంలో చరమూర్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు మాత్రం కొవిడ్‌ నిబంధనలమేరకు కొనసాగునున్నాయి. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అనుబంధ ఆలయం సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి మహోత్సవాలకు మంగళవారం ఉదయం 10గంటలకు శైవాగమ సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకలను సైతం ఆస్థానపరంగా నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమై 20న ఎదుర్కోలు మహోత్సవం, 21న కల్యాణం, 22న పట్టాభిషేకం, శృంగారడోలోత్సవం, 23న సత్యనారాయణ స్వామి వ్రతం, 24న కంకణ విమోచనంతో వసంత నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తంకానున్నాయి.


హరిహరులకు విశేష పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. ప్రధానాలయంలో స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠా అలంకారమూర్తులకు హారతి నివేదించారు. అభిషేకం, అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ రామలింగేశ్వరస్వామిని ఆస్థానపరంగా ఆరాదించిన పూజారులు ఉపాలయంలో పంచామృతాభిషేకం, శివపార్వతుల సహస్రనామ పఠనాలతో బిల్వార్చన చేశారు. కాగా, స్వామి వారికి రూ.5,04,305 ఆదాయం సమకూరింది.


మోత్కూరులో బోనాలు!

మోత్కూరు: ఉగాది రోజున మోత్కూరులో ముత్యాలమ్మకు బోనాలు, ఎడ్ల బండ్లతో ప్రభలు తీయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు అంతా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది బోనాల సమర్పణపై సందిగ్ధం ఏర్పడింది.

Updated Date - 2021-04-13T06:34:31+05:30 IST