కరోనాను తేలికగా తీసుకోవద్దు: ప్రజలకు ఒక జంట వినతి!

ABN , First Publish Date - 2020-10-01T15:06:55+05:30 IST

కరోనాను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి, అధ్యాపకురాలు ఇందూ భరద్వాజ్, ఆమె భర్త నవనీత్ భరద్వాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కులూ ప్రాంతంలో ఉండే వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.

కరోనాను తేలికగా తీసుకోవద్దు: ప్రజలకు ఒక జంట వినతి!

శిమ్లా: కరోనాను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి, అధ్యాపకురాలు ఇందూ భరద్వాజ్, ఆమె భర్త నవనీత్ భరద్వాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కులూ ప్రాంతంలో ఉండే వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఇప్పుడు కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఈ దంపతులు తమకు కరోనా కారణంగా ఎదురైన అవస్థలను తెలియజేశారు. కరోనాతో ఎదురైన అనారోగ్య సమస్యలను తాము జీవితంలో ఎప్పటికీ మరచిపోలేమని తెలిపారు. చాలామంది కరోనాను తేలికగా తీసుకుని తప్పు చేస్తున్నారన్నారు. 



కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా, నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమకు ముందుగా గొంతు నొప్పి వచ్చిందని, తల భారంగా అనిపించేదని, అలాగే దగ్గు, నీరసం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది మొదలైన సమస్యలు ఎదురయ్యాయన్నారు. ఔషధాలు తీసుకున్నా ఈ సమస్యలు తగ్గలేదన్నారు. దీంతో కరోనా టెస్ట్ చేయించుకున్నామన్నారు. పాజిటివ్ రిపోర్టు రావడంతో ఏ మాత్రం భయపడకుండా ధైర్యంతో మెలగుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చికిత్స తీసుకున్నామని తెలిపారు. అయితే కరోనా విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది లేనిపోనివి రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులూ కోవిడ్ సెంటర్‌లో కరోనా బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. 

Updated Date - 2020-10-01T15:06:55+05:30 IST