HYD : కార్పొరేటర్ కుమారుడి దౌర్జన్యం.. ఓ మహిళ ఫ్లాట్కు వెళ్లి..!
ABN , First Publish Date - 2022-03-19T11:57:05+05:30 IST
ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ కుమారుడు రామకృష్ణగౌడ్ ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి
- వస్తువులు ధ్వంసం
- కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ కుమారుడు రామకృష్ణగౌడ్ ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. సదరు మహిళ ఇంట్లో లేకపోవడంతో వస్తువులను, పూలకుండీలను ధ్వంసం చేయడమేకాక చంపుతానంటూ హెచ్చరిస్తూ నానా రభస చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకామయి మిత్రహిల్స్లోని ఓ ఫ్లాట్లో రత్నమాణిక్యం ఉంటోంది. ఈనెల 16న తన తల్లి ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్గౌడ్ కుమారుడు రామకృష్ణగౌడ్ ఆమె ఫ్లాట్కు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కోపంతో ఊగిపోతూ ఇంటిబయట ఉన్న పూలకుండీలు, సింక్, కిటీకీలు ధ్వంసం చేశాడు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి వస్తువులు ఎత్తేశాడు. నిన్ను చంపేస్తానంటూ అరుస్తూ వెళ్లిపోయాడు. ఫ్లాట్లోని వారు వెంటనే రత్నమాణిక్యమ్మకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరిన ఆమె జరిగిన ఘటన గురించి తెలుసుకొని కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రాజేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ కుమారుడు ఈ దౌర్జన్యానికి పాల్పడడానికి గల కారణాలు తెలియరాలేదు.