లాక్డౌన్పై కేరళ సర్కార్ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2020-07-06T01:19:32+05:30 IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యగా ..
తిరువనంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యగా రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించింది. కోవిడ్ నిరోధక కొత్త మార్గదర్శకాలు, నిబంధనలను తీసుకువచ్చింది. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
పనిప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, ప్రతిచోటూ 6 అడుగుల దూరం పాటించాలని, వచ్చే ఏడాది పాటు ఈ నిబంధనలు పాటించడం తప్పనసరి అని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
వివాహాలకు గరిష్ట అనుమతి 50 మంది మాత్రమేనని, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. ఎక్కువ మంది సమావేశమయ్యే సందర్భాలుంటే స్థానిక యంత్రాంగం ప్రత్యేక అనుమతి తప్పనిసరని తెలియజేసింది. బహిరంగ ప్రదేశాలు ఉమ్మితే శిక్షార్హమని తెలిపింది. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణించాలనుకునే వారు తప్పనిసరిగా కేరళ ప్రభుత్వ జాగ్రత-ఇ-ఫ్లాట్ఫాంలో రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ దుకాణం వద్దనైనా గరిష్టంగా 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని చెప్పింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 240 కేసులు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,000 దాటింది.