పెద్ద పెద్ద గొడుగులతో సోషల్ డిస్టెన్సింగ్...ఎక్కడంటే...
ABN , First Publish Date - 2020-06-02T17:31:11+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేందుకు గొడుగులను ఉపయోగిస్తున్నారు. పూణే, నాసిక్ హైవేలోని మాంచర్ గ్రామ పంచాయతీ...
పూణే: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేందుకు గొడుగులను ఉపయోగిస్తున్నారు. పూణే, నాసిక్ హైవేలోని మాంచర్ గ్రామ పంచాయతీ ప్రజలు గొడుగును సోషల్ డిస్టెన్స్ సాధనంగా ఉపయోగిస్తున్నట్లు స్థానిక అధికారి తెలిపారు. ఇటువంటి కట్టుబాటు కారణంగానే 50 వేల జనాభా ఉన్నఈ గ్రామంలో ఈనాటికీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలించడం కారణంగా, ముంబై నుండి ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారివలన కరోనా వ్యాప్తి ప్రమాదం ఉందని గ్రామ సర్పంచ్ దత్తా గంజాలే ఆందోళ వ్యక్తం చేశారు. కేరళలో మాదిరిగా గొడుగులను ఉపయోగించి, గ్రామంలోని వారంతా సామాజిక దూరం పాటిస్తున్నారని తెలిపారు. దీనికి తోడు తమ గ్రామంలో ఆచరిస్తున్న ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తున్నామన్నారు.