కరోనాతో ఎంపీలో వైద్యుడి మృతి
ABN , First Publish Date - 2020-04-10T08:42:11+05:30 IST
కరోనా వైర్సతో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ వైద్యుడు (62) చనిపోయాడు. దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ...
- ప్రాణం తీసిన స్వయం చికిత్స
ఇండోర్, ఏప్రిల్ 9 : కరోనా వైర్సతో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ వైద్యుడు (62) చనిపోయాడు. దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన మొదటి వైద్యుడు ఆయన. ఇండోర్లోని శ్రీఅరబిందో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన మృతి చెందారు. ఇండోర్లో ఆ డాక్టర్కు ఓ క్లినిక్ ఉంది. రోజూ 150 పైగా రోగులకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేవారు. వారం క్రితమే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. మూడ్రోజుల క్రితమే పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. పది రోజుల క్రితం ఆయనలో తీవ్రమైన మధుమేహం, హైపర్టెన్షన్, అలర్జిక్ రైనిటిస్ (ముక్కులో మంట) కనిపించాయని ఆయన బంధువు ఒకరు ఓ వార్తా సంస్థకు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆ డాక్టర్ తన భార్య పక్కన కూర్చుని ఓ వీడియో తీశారని, తాను బానే ఉన్నానని, కొంతమంది తన ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారంచేస్తున్నారని ఆ వీడియోలో చెప్పారని వైద్యుడి ఫ్యామిలీ ఫ్రెండ్ పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వైద్యుడిని ఆ డాక్టర్ సంప్రదించారని ఆ స్నేహితుడు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించినా ఆయన స్వయంగా చికిత్స తీసుకున్నారని చెప్పారు.