నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-01-16T05:18:38+05:30 IST
జిల్లాలో శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు జేసీ సాయికాంత్వర్మ వెల్లడించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
కడప(కలెక్టరేట్), జనవరి 15: జిల్లాలో శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు జేసీ సాయికాంత్వర్మ వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నేపథ్యంలో ఆయన రిమ్స్ జీజీహెచ్ ఆసుపత్రిని సందర్శించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, రిమ్స్ సూపరింటెండెంట్ తదితరులతో రిమ్స్ ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. రిమ్స్లో పేషంట్లు వేచి వుండే గది, వ్యాక్సినేషన్ చేసుకున్న అనంతరం వారిని పరీక్ష కోసం ఉంచే విశ్రాంతి గదిని, వ్యాక్సిన్ స్టోరేజ్ ఏర్పాట్లు, ఎవరికి వ్యాక్సిన్ వేస్తున్నామో వారి వివరాల నమోదు తదితరాలను పరిశీలించి వివిధ అంశాలలో వైధ్యాధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే చిన్న పిల్లల వార్డును కూడా జేసి తనిఖీ చేశారు. మొదటి విడతలో ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులు, హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారని జేసికి వైద్యాధికారులు వివరించారు. అనంతరం వివిధ అంశాలో సమీక్షించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.