పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2022-07-03T06:11:32+05:30 IST
జిల్లాలో ఫోర్త్వేవ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది పాజిటివ్ కేసుల నమోదైన నేపథ్యంలో ‘మళ్లీ కొవిడ్ కలవరం’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది.
రోజుకు 250కిపైగా పరీక్షలు చేసేందుకు ఆదేశాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించి కలెక్టర్ దినేష్కుమార్
అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖకు ఆదేశం
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 2 : జిల్లాలో ఫోర్త్వేవ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది పాజిటివ్ కేసుల నమోదైన నేపథ్యంలో ‘మళ్లీ కొవిడ్ కలవరం’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. కలెక్టర్ దినేష్కుమార్ శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు పలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే కరోనా పరీక్షలు ప్రారంభించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీఆర్డీఎల్ టెస్టులు మాత్రమే చేస్తుండగా రాపిడ్ కూడా చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. నిన్నటి వరకు రోజువారీ 100లోపు టెస్టులు చేస్తుండగా శనివారం నుంచే 250కిపైన పెంచింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్ రాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
ప్రజానీకం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో టెస్టులు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రజలకు ఏదైనా అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలి. పూర్తిగా కరోనా తొలగిపోలేదన్న విషయాన్ని ప్రజలు గమనించి నిబంధనలు పాటించాలి.