కరోనా ‘మహా’ మృత్యు పంజా
ABN , First Publish Date - 2020-04-06T07:40:22+05:30 IST
కరోనా మహారాష్ట్రపై మృత్యు పంజా విసురుతోంది. వైర్సతో ఆదివారం ఆ రాష్ట్రంలో 13 మంది చనిపోయారు. వీరిలో 11 మంది అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర...
- మహారాష్ట్రలో ఆదివారమే 13 మంది మృతి
- వీరిలో 11 మంది ప్రయాణ చరిత్ర లేనివారే
- దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 126కు..
న్యూఢిల్లీ, బెంగళూరు, ఏప్రిల్ 5: కరోనా మహారాష్ట్రపై మృత్యు పంజా విసురుతోంది. వైర్సతో ఆదివారం ఆ రాష్ట్రంలో 13 మంది చనిపోయారు. వీరిలో 11 మంది అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేనివారే. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 747కు చేరాయి. మొత్తంమీద కొవిడ్తో మహారాష్ట్రలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లో ఆదివారం ఇద్దరు మృతి చెందారు. తమిళనాడు (571), ఢిల్లీ (503) రాష్ట్రాల్లో వరుసగా 86, 53 కొత్త కేసులు రికార్డులకెక్కాయి. కర్ణాటక (151)లో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో 42, హిమాచల్ ప్రదేశ్లో 15, కేరళలో 8 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వాలు తెలిపాయి. గుజరాత్లోమృతుల సంఖ్య 11కి చేరింది. వైర్సతో ఆదివారం దేశంలో 26 మంది వరకు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 126 అయింది. కేసులు 4 వేలు దాటాయి. కాగా, దేశంలో కేసులు 3,577, మృతులు 83గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేసులు రెట్టింపునకు 4.1 రోజులు..
ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య రెట్టింపునకు 4.1 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. తబ్లీగీ జమాత్ సంబంధ కేసులు లేకపోతే ఇందుకు 7.4 రోజుల సమయం పట్టేదని చెప్పారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. చెన్నైలో ఇంటింటి సర్వే చేపడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఇద్దరు ఐఏఎస్లకు వైరస్ సోకడంతో భోపాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించారు. సీఆర్పీఎఫ్ వైద్యుడికి కరోనా నిర్ధారణ కావడంతో డీజీ ఏపీ మహేశ్వరి (54), మాజీ డీజీ, హోం శాఖలో సీనియర్ భద్రతా సలహాదారు కె.విజయకుమార్ (67) సహా 25 మంది అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.