ఇక కరోనా రెండోదశ!

ABN , First Publish Date - 2020-09-30T09:04:28+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కొవిడ్‌-19 రెండోదశ త్వరలోనే ప్రారంభం కానుందా? మరోసారి ఈ మహమ్మారి అన్ని దేశాల్లోనూ ప్రతాపం చూపించనుందా?... ఈ ప్రశ్నలకు వైద్య నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు...

ఇక కరోనా రెండోదశ!

  • త్వరలోనే అమెరికాలో ప్రారంభం
  • కేసులు మరింతగా పెరిగే అవకాశం 
  • అంచనా వేస్తున్న వైద్య నిపుణులు 
  • ఇప్పటికే యూరప్‌లో ప్రతాపం మొదలు
  • కొవిడ్‌ ధాటికి 10లక్షల మందికి పైగా బలి  

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కొవిడ్‌-19 రెండోదశ త్వరలోనే ప్రారంభం కానుందా? మరోసారి ఈ మహమ్మారి అన్ని దేశాల్లోనూ ప్రతాపం చూపించనుందా?... ఈ ప్రశ్నలకు వైద్య నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే యూర్‌పలోని కొన్ని దేశాల్లో కరోనా రెండో దశ ప్రారంభం కావడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. బ్రిటన్‌, స్పెయిన్‌, రష్యా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. త్వరలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రానుందని అంచనా వేస్తున్నారు. అక్కడి కళాశాలల క్యాంప్‌సలకు విద్యార్థులు తిరిగి రావడం వైరస్‌ వ్యాప్తికి దారితీసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10లక్షలు దాటేసింది. 2004లో వచ్చిన సునామీలో మరణించిన వారికంటే నాలుగు రెట్లు అధికం. గత వేసవిలో కరోనా మృతదేహాలతో ఇటలీలోని శ్మశాన వాటికలు కిటకిటలాడాయి.


9 నెలలుగా అన్ని దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రజల జీవన, పనిచేసే విధానాన్ని సమూలంగా మా ర్చేసింది. దీనికి టీకా అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరార్థ గోళంలో శీతాకాలం సమీపిస్తున్నందున కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు పెరుగుతోంది భారత దేశంలోనే. ఇక్కడ మరణాలు 96వేలు దాటేశాయి. అత్యధిక మృతుల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజల్‌, భారత్‌ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 


బాధాకరమైన క్షణం: డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ 

కరోనా మరణాలు పది లక్షలు దాటిపోవడం వేధిం చే మైలురాయి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి ఇప్పట్లో అంతరించే అవకాశాలు కనిపించడం లేదన్నారు. విద్యావ్యవస్థకు ఆటంకం కలిగించడంతో పాటు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోవడానికి కరోనా కారణమవుతోందని పేర్కొన్నారు. కాగా, కరోనా మరణాలు పది లక్షలు దాటడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ట్రెడాస్‌ అధనోమ్‌ ఘిబ్రేయిసస్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ మైలురాయిని చేరుకోవడం ప్రపంచానికి బాధాకరమైన క్షణంగా పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో దీని బారినుంచి బయటపడతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాలో మంగళవారం 38 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత 50 రోజుల్లోనే అత్యల్పం కావడం గమనార్హం. 



దేశ జనాభాలో 6.6 శాతం మందికి కరోనా

దేశ జనాభాలో 6.6 శాతం మందికి.. ఇంకా సులభంగా చెప్పాలంటే ప్రతి 15 మంది భారతీయుల్లో ఒకరికి ఆగస్టు నాటికే కరోనా వైరస్‌ సోకిందట!! సాక్షాత్తూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన రెండో జాతీయ సీరో సర్వేలో ఈవిషయం వెల్లడైంది. టీనేజర్లు మినహా వయోజనుల్లో 7.1 శాతం మందికి గతంలోనే కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకి తగ్గిపోయిందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని ఐసీఎంఆర్‌ పేర్కొంది. 



‘కాంగో ఫీవర్‌’ వస్తోంది.. పారా హుషార్‌!!

గుజరాత్‌లోని సరిహద్దు జిల్లాల్లో కలకలం

ఇప్పటికే కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతున్న భారత్‌పైకి ఇప్పుడు క్రిమియన్‌ ‘కాంగో’ ఫీవర్‌ రూపంలో మరో గండం ముంచుకొస్తోంది. ఇప్పటికే గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాల్లో  కాంగో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఈనేపథ్యంలో దానికి సమీపంలో ఉండే మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా అధికార యంత్రాంగం  ప్రజలకు  మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. క్రిమియన్‌ కాంగో హెమరేజిక్‌ ఫీవర్‌ (సీసీహెచ్‌ఎఫ్‌) అనే పేనుజాతి కీటకం కుడితే మనుషులు, పశువులకు కాంగో ఫీవర్‌ వస్తుంది. అనంతరం ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతుంది. అయితే అది సోకిన జంతువుల రక్తాన్ని తాకినప్పుడు, వాటి మాంసాన్ని తిన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్‌ సంక్రమించే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని పాడి రైతులు, మాంసం విక్రేతలు, పశు సంవర్ధక శాఖ సిబ్బందికి పాల్ఘర్‌ జిల్లా ఉన్నతాధికారులు సూచనలు జారీచేశారు


Updated Date - 2020-09-30T09:04:28+05:30 IST