93 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

ABN , First Publish Date - 2020-11-21T20:32:36+05:30 IST

ఒకపక్క కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. కానీ మన వైద్యులు అహర్నిశలూ శ్రమించి బాధితులకు...

93 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

న్యూఢిల్లీ: ఒకపక్క కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలే ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఓ తీపికబురందించింది. తొలిసారిగా 93 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు సాధించినట్లు ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా శుక్రవారం 46,232 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసులు 90,50,597కి చేరాయి. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 


ఇప్పటివరకు కరోనా బారి నుంచి 84,78,124 మంది కోలుకోగా.. ఇంకా 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. 1,32,726 మంది మరణించారు. అంటే.. మొత్తం కేసుల్లో 93.67 శాతం మంది కోలుకోగా.. 4.86 శాతం మంది చికిత్స పొందుతున్నారు. 1.47 శాతం మరణించారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5,79,70,452కు చేరుకున్నాయి. వారిలో 13,78,839 మంది మరణించగా.. 4,01,84,355 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-11-21T20:32:36+05:30 IST