మరో ఐదుగురికి పాజిటివ్.. అతడికి కరోనా ఎలా వచ్చిందో తెలీదట..!
ABN , First Publish Date - 2020-07-06T20:51:27+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో ఆదివారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినదని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి పాజిటివ్
కరోనాతో సదాశివపేటలో ఒకరి మృతి
సంగారెడ్డి అర్బన్/సదాశివపేట/కోహీర్ : సంగారెడ్డి జిల్లాలో ఆదివారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినదని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. అమీన్పూర్-1, ఆర్సీపురం-1, సదాశివపేట-1, దిగ్వాల్- 1, జహీరాబాద్లోని దత్తగిరి కాలనీలో ఒకరికి కరోనా సోకిందని పేర్కొన్నారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి కరోనా వార్డులో పాజిటివ్ బాధితులు 13 మంది, కరోనా అనుమానిత లక్షణాలతో చేరిన వారు నలుగురు ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. సదాశివపేటలో పట్టణంలోని 20వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి (68) గాందీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల 30వ తేదీన తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆస్పత్రి వర్గాలు ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.
దీంతో శనివారం చికిత్స నిమిత్తం ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. హైదరాబాద్లోనే అతడికి అంత్యక్రియలు పూర్తి చేశారు. పట్టణంలో ఇప్పటికే ఏడుగురు వ్యక్తులు కరోనా వ్యాధి బారిన పడగా వీరిలో ఒకరు మృతి చెందడం అందరిని కలవరపెడుతోంది. కోహీర్ మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఎలా వ్యాపించిందనేది తెలియలేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాజ్కుమార్ తెలిపారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.