ఉమ్మడి జిల్లాలో ఏడుగురికి కరోనా
ABN , First Publish Date - 2020-06-04T09:17:04+05:30 IST
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలకూ విస్తరిస్తోంది.
రంగారెడ్డిలో ఆరుగురికి, మేడ్చల్లో ఒక్కరికి పాజిటివ్
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్ / చేవెళ్ల / శంకర్ పల్లి / కీసర రూరల్ : కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలకూ విస్తరిస్తోంది. తాజాగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అజీజ్నగర్లో ఒకరికి, శేరిలింగంపల్లిలో ముగ్గురికి, చేవెళ్ల నియోజక వర్గంలో ఇద్దరికి, మేడ్చల్జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఒకరికి కరోనా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం రావుపల్లికలాన్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు నిత్యం పూలను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అలాగే చేవెళ్ల షీటీం ఎస్సై వద్ద డ్రైవర్గా పని చేస్తున్న ఓ కానిస్టేబుల్కు పాజిటివ్ వచ్చింది.
ఇతని స్వగ్రామం శంకర్పల్లి మం డలం పర్వేద. వీరిరువురిని నగరంలోని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మరో కానిస్టేబుల్కు కరోనా వైద్యపరీక్షలు చేసేందుకు హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా అతనికి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారని చేవెళ్ల ఎస్సై రేణుకారెడ్డి తెలిపారు.
నెలల చిన్నారికి..
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 3నెలలుగా జగిత్యాలలో ఉన్న ఓ కుటుంబం మే 25న దమ్మాయిగూడకు వచ్చారు. వారికి 8నెలల బాబు ఉన్నాడు. వారం నుంచి ఆ బాబుకు జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవటంతో కరోనా పరీక్షలు చేయించడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో బాబును, అతని తల్లిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కీసర మండల వైద్యాధికారి వెల్లడించారు. ఆ కుటుంబానికి చెందిన మిగతా తొమ్మిది మందిని హోం క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.