గుంటూరు జిల్లాలో కొత్తగా 621 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-11T12:25:59+05:30 IST
జిల్లాపై కరోనా కనికరం చూపడంలేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతానికి..
వీడని.. వైరస్
గుంటూరు నగరంలో 122 కరోన కేసులు
నరసరావుపేట పారిశుధ్య కార్మికుడి మృతి
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాపై కరోనా కనికరం చూపడంలేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతానికి కొత్తగా వైరస్ వ్యాపిస్తోంది. జిల్లాలో గడచిన 24 గంటల్లో జిల్లాలో 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో జాస్మిన్ సోమవారం ప్రకటించారు. గుంటూరు నగరంలో కొద్ది రోజులుగా నమోదైన పాజిటివ్ కేసులతో పోల్చితే సోమవారం కొంతమేరకు ఉధృతి తగ్గింది. తాజాగా 122 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 57 మండలాలకు 38 మండలాల్లో కొత్తగా కేసులు వచ్చాయి. మిగతా 19 మండలాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు.
గుంటూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరికి పాజిటివ్ వచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, సీనియర్ నేత మన్నవ సుబ్బారావు తదితరులు ఆయనను ఫోన్లో పరామర్శించారు. తెనాలి పట్టణంలో 37, కఠెవరం, పెదరావూరు, తేలప్రోలు, మల్లెపాడు గ్రామాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. గురజాలలో 16, పిడుగురాళ్లలో 21 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. పెదకూరపాడు మండలంలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు 75 తాళ్ళూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుగుణ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పాటిబండ్లలో తొమ్మిది మందికి, పెదకూరపాడులో ముగ్గురికి, కంభంపాడులో ఒకరికి పాజిటివ్గా నిర్ధారించారు.
మరొకరు మృతి
నరసరావుపేట పట్టణంలో కరోనాతో మరొకరు మృతి చెందారు. క్యారంటైన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుడికి కరోనా సోకింది. దీంతో ఇతడ్ని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్టు మునిసిపల్ అధికారులు తెలిపారు. కార్మికుడి మృతికి మునిసిపల్ అధికారులు, కార్మికులు, సీఐటీయూ నాయకులు సోమవారం సంతాపం తెలిపారు. కాగా పట్టణంలో నెల రోజుల అనంతరం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో 3 కేసులు నమోదయ్యాయి.