కరోనా లక్షణాలుంటే చెప్పండి
ABN , First Publish Date - 2020-08-13T20:21:46+05:30 IST
కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం ఆగకుండా సమాచారం ఇచ్చేందుకు..
అనంతపురం(ఆంధ్రజ్యోతి): కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం ఆగకుండా సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావాలని కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి కరోనా లక్ష ణాలున్న 563 మందిని గుర్తించి, కొవిడ్ ఆస్పత్రులు, సెంటర్లకు తరలించి వారి ప్రాణాలను కాపాడామన్నారు. వరుసగా మూడ్రోజులు జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు 94 కంటే తక్కువగా ఉన్నా, ఈ లక్షణాల్లో ఏ రెండు ఉన్నా ముందుగానే గుర్తించి కొవిడ్ ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నామన్నారు.
ఈ ప్రక్రియను ఈనెల 4వ తేదీన ప్రారంభించామన్నారు. కరోనా లక్షణాలున్నవారి ఇళ్ల వద్దకే వెళ్లి గుర్తిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకు తహసీల్దార్లు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే వారిని అంబులెన్స్లు, ఆ మండలానికి కేటాయించిన రెండు వాహనాల ద్వారా నేరుగా ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. స్థానికంగా వైద్యులతో పరీక్షలు చేసిన తరువాత చికిత్స అవసరంలేని వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపుతున్నామన్నారు. జిల్లాలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే భయపడకుండా ముందుకు వచ్చి, సమాచారాన్ని కంట్రోల్ రూమ్కుగానీ, స్థానిక వైద్యాధికారులు, ఏఎన్ఎంలకు గానీ తెలియజేయాలన్నారు.