పసిడి పురిని వణికిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-06-29T10:20:38+05:30 IST
పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలు
215కు చేరిన పాజిటివ్ కేసులు
లాక్డౌన్ వైపు ప్రజల మొగ్గు
స్వచ్ఛందంగా దుకాణాల పనివేళల కుదింపునకు యత్నం
ప్రొద్దుటూరు క్రైం, జూన్ 28 : పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలు భయపడిపోతున్నారు. ప్రొద్దుటూరు పట్టణ, మండల పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 215కు చేరుకోగా తాజాగా ఆదివారం మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా కోవిడ్ విధుల్లో ఉన్న వారికి కరోనా సోకడం ఇక్కడి అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఆరోగ్యశాఖలో ఐదుగురికి, అటవీ శాఖలో ఇద్దరికి, పోలీసు శాఖలో ఇద్దరికి కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నాటి నుంచి రోజు రోజుకు ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణ ప్రజలు లాక్డౌన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది లాక్డౌన్ అమలు చేయాలని అధికారులకు విజ్ఞప్తులు చేసి ఉ న్నారు. వ్యాపార సంఘాలు కూడా మొన్నటి వరకు దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోరిన వారే ఇపుడు స్వచ్చందంగా ముందుకొచ్చి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రకటనలిస్తున్నారు. కరోనా వైరస్ను నియంత్రించాలంటే ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసరమైతేనే బయటికి రావాలని, వచ్చినా మాస్క్లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని డీఎస్పీ సుధాకర్ లోసారితో పాటు అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.