కోవిడ్-19తో ఇటలీ ప్రధాని భద్రతాధికారి మృతి
ABN , First Publish Date - 2020-04-05T01:06:40+05:30 IST
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే...
రోమ్: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే భద్రతాధికారుల్లో ఒకరు ఇవాళ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత నెల 21న మృతుడు జార్జియో గుస్టామాచియా (52) కరోనా బారిన పడినట్టు గుర్తించామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి ఆయనను ప్రధాని భద్రతా విధుల నుంచి తప్పించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. గత రెండు వారాలుగా ప్రధానికి గుస్టామాచియా దూరంగా ఉన్నట్టు పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా 55 ఏళ్ల ప్రధాని కాంటేకి కూడా పరీక్షలు జరిపామనీ.. అయితే ఆయనకు కోవిడ్-19 నెగిటివ్ అని తేలిందని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా ఇటలీ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 1.19 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడగా.. 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు.