టిడ్కో ఇళ్లకు రుణాలిచ్చి సహకరించండి
ABN , First Publish Date - 2022-09-29T05:47:55+05:30 IST
‘టిడ్కో’ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేసి సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జీ
బ్యాంకర్లకు జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు వినతి
విశాఖపట్నం, సెప్టెంబరు 28: ‘టిడ్కో’ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేసి సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందని, బ్యాంకర్లు అలసత్వం వహించకుండా రుణాలిచ్చి వారి కల నెరవేర్చాలని కోరారు.
బ్యాంకులకు కావాల్సిన లబ్ధిదారుల దరఖాస్తులతోపాటు ఇతర నిబంధనలు పూర్తిచేసి అందించే విషయంలో యూసీడీ అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికీ రుణం మంజూరయ్యేలా చూడాలన్నారు. రుణం మంజూరయ్యాక లబ్ధిదారుని పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని సూచించారు. బ్యాంకర్లు కూడా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి రుణ మంజూరు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పాపునాయుడు, అన్ని బ్యాంకుల మేనేజర్లు, జీవీఎంసీ డీపీఓలు, ఏపీడీలు, సీఓలు పాల్గొన్నారు.